Exodus · బైబిల్ (తెలుగు)

Exodus 32

1మోషే కొండ దిగి రావడం ఆలస్యం కావడం చూసిన ప్రజలు అహరోను దగ్గరికి వచ్చారు. “లే, మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి మా కోసం ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు నుండి మమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన మోషే అనే వాడు ఏమయ్యాడో మాకు తెలియడం లేదు” అన్నారు.

2అప్పుడు అహరోను “మీ భార్యల, కొడుకుల, కూతుళ్ళ చెవులకు ఉన్న బంగారు పోగులు తీసి నా దగ్గరికి తీసుకు రండి” అని చెప్పాడు.

3ప్రజలంతా తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను దగ్గరికి తెచ్చారు.

4అతడు వాటిని తీసుకుని దూడ రూపం అచ్చుతో పోత పోసి బంగారం దూడను తయారు చేయించాడు. అప్పుడు ప్రజలు “ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే” అని కేకలు వేశారు.

5అహరోను దాన్ని చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాడు. తరువాత అహరోను “రేపు యెహోవాకు పండగ జరుగుతుంది” అని చాటింపు వేయించాడు.

6తరువాతి రోజు ప్రజలు ఉదయాన్నే లేచి హోమబలులు, శాంతిబలులు సమర్పించారు. తరువాత ప్రజలు తినడానికి, తాగడానికి కూర్చున్నారు. నాట్యం చేయడం మొదలు పెట్టారు.

7అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “కొండ దిగి వెళ్ళు. ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకు వచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.

8వాళ్ళు పాటించాలని నేను నియమించిన ఉపదేశాల నుండి అప్పుడే తప్పిపోయారు. వాళ్ళ కోసం పోత పోసిన దూడ విగ్రహం తయారు చేసుకుని దానికి సాగిలపడి బలులు అర్పించి ‘ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే’ అని చెప్పుకుంటున్నారు.”

9యెహోవా ఇంకా ఇలా అన్నాడు. “నేను ఈ ప్రజలను గమనిస్తున్నాను. వాళ్ళు + 32:9 తలబిరుసు, మొండి, మెడవంచని మనుషులుకఠిన హృదయులయ్యారు.

10నువ్వు చూస్తూ ఉండు, నా కోపం వారి మీద రగులుకునేలా చేస్తాను. వాళ్ళను దహించివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను.”

11అందుకు మోషే తన దేవుడైన యెహోవాను బతిమిలాడాడు. “యెహోవా, నీ ప్రజల మీద నీ కోపం ఎందుకు రగులుకోవాలి? నీ బలిష్టమైన చెయ్యి చాపి ఐగుప్తు దేశం నుండి వీళ్ళను బయటకు రప్పించావు కదా.

12ఐగుప్తీయులు ‘వాళ్ళ దేవుడు వాళ్ళకు కీడు కలిగించి భూమిపై లేకుండా నశింపజేసి కొండల్లో చనిపోయేలా చేయడానికి వాళ్ళను తీసుకు వెళ్ళాడు’ అని ఎందుకు చెప్పుకోవాలి? నీ కోపాగ్ని నుండి మళ్లుకుని వాళ్లకు కీడు చెయ్యకు.

13నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఆకాశంలో ఉండే నక్షత్రాలవలే మీ సంతానాన్ని అభివృద్ధి పరచి నేను చెప్పిన ఈ భూమి అంతటినీ మీ సంతానానికి ఇస్తాననీ, వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటారనీ, దానికి నువ్వే సాక్ష్యం అనీ వాళ్ళతో ఒప్పందం చేశావు” అన్నాడు.

14అప్పుడు యెహోవా పరితపించి తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడు చెయ్యలేదు.

15దేవుడు తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన రెండు పలకలు మోషే చేతిలో ఉన్నాయి. ఆ పలకలపై రెండువైపులా దేవుడు నియమించిన ఆజ్ఞలు రాసి ఉన్నాయి.

16ఆ పలకలు దేవుడు తయారు చేశాడు. ఆ పలకలు పట్టుకుని మోషే కొండ దిగి వచ్చాడు.

17శిబిరంలో ప్రజలు వేస్తున్న కేకల శబ్దం యెహోషువకు వినబడింది. “మన శిబిరంలో యుద్ధ ధ్వని వినబడుతోంది” అన్నాడు.

18మోషే “అది జయ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత వాయిద్యాల శబ్దం నాకు వినబడుతోంది” అన్నాడు.

19అతడు శిబిరం చేరుకున్నప్పుడు ప్రజలు చేసుకున్న ఆ దూడ, నాట్యం చేస్తున్న ప్రజలు కనిపించారు. మోషే కోపం రగులుకుంది. అతడు తన చేతుల్లో ఉన్న పలకలను కొండ కింది భాగానికి విసిరేసి వాటిని పగలగొట్టాడు.

20ప్రజలు తయారు చేసుకున్న ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేశాడు. ఆ పొడిని నీళ్లలో కలిపి ఇశ్రాయేలు ప్రజల చేత తాగించాడు.

21అప్పుడు మోషే “ఈ ప్రజల మీదికి ఈ గొప్ప అపరాధం వచ్చేలా చేయడానికి వీళ్ళు నిన్ను ఎలా ప్రేరేపించారు?” అని అహరోనును అడిగాడు.

22అహరోను “నా ప్రభూ, నీ కోపం రగులుకోనియ్యకు. ఈ ప్రజలు దుర్మార్గులు అనే విషయం నీకు తెలుసు.

23వాళ్ళు ‘మా ముందుండి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి సిద్ధం చెయ్యి. ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకు వచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియడం లేదు’ అన్నారు.

24అప్పుడు నేను ఎవరి దగ్గర బంగారం ఉన్నదో వాళ్ళంతా దాన్ని ఊడదీసి తీసుకు రండి అని చెప్పాను. వాళ్ళు తెచ్చిన దాన్ని అగ్నిలో వేస్తే ఈ దూడ అయ్యింది” అని చెప్పాడు.

25ప్రజలు తమ శత్రువుల ఎదుట నవ్వులపాలు కావడానికి అహరోను కారకుడయ్యాడు. ప్రజలు విచ్చలవిడితనంగా తిరగడం మోషే గమనించాడు.

26అప్పుడు మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి “యెహోవా పక్షంగా ఉన్నవాళ్ళంతా నా దగ్గరికి రండి” అన్నాడు. లేవీయులంతా అతని దగ్గరికి వచ్చారు.

27అతడు వాళ్ళను చూసి “మీలో ప్రతి ఒక్కరూ మీ కత్తులు నడుముకు కట్టుకోండి, శిబిరంలో గుమ్మం నుండి గుమ్మానికి వెళ్తూ ప్రతి ఒక్కరూ తమ సోదరుణ్ణి, తమ స్నేహితుణ్ణి, తమ పొరుగువాణ్ణి సంహరించండి” అన్నాడు.

28లేవీయులు మోషే మాట ప్రకారం చేసారు. ఆ రోజున ప్రజల్లో సుమారు మూడు వేల మంది హతమయ్యారు.

29మోషే లేవీయులతో “మిమ్మల్ని మీరు యెహోవాకు ప్రతిష్ట చేసుకోండి. మీలో ప్రతి ఒక్కరూ మీ కొడుకులనూ, సోదరులనూ చంపి యెహోవా ఆశీర్వాదాలు పొందారు” అన్నాడు.

30మరుసటి రోజు మోషే ప్రజలతో “మీరు గొప్ప పాపం చేశారు. నేను యెహోవా దగ్గరికి కొండ ఎక్కి వెళ్తాను. ఒకవేళ మీరు చేసిన పాపం కోసం ఏదైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అన్నాడు.

31మోషే యెహోవా కొండకు మళ్ళీ వెళ్ళాడు. “అయ్యో, ఈ ప్రజలు ఎంతో పాపం చేశారు. వాళ్ళు తమ కోసం బంగారు దేవుణ్ణి చేసుకున్నారు.

32అయ్యో, వాళ్ళు చేసిన పాపాన్ని పరిహరించు, లేని పక్షంలో నువ్వు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తొలగించు” అని బతిమాలుకున్నాడు.

33అందుకు యెహోవా “నాకు విరోధంగా ఎవరు పాపం చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తొలగిస్తాను.

34నువ్వు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నేను శిక్షించే రోజున వాళ్ళ పాపం విషయంలో వాళ్ళకు శిక్ష రప్పిస్తాను” అని మోషేతో చెప్పాడు.

35ప్రజలు అహరోను చేత చేయించిన దూడను బట్టి యెహోవా వాళ్ళను బాధలకు గురి చేశాడు.

← Exodus 31Read In The App, Free →Exodus 33 →

Study Exodus 32

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

12345678910111213141516171819202122232425262728293031323334353637383940